జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

నజరయ్య మతం


నూతన మతతత్వ సిద్ధాంతాలతో కూడిన 'నజరయ్య మతం' రెండు వందల ఏళ్ల క్రితం నాటిది. ఆనాటి కాలంలో అణగారిన వర్గాలను ఆకర్షించిన మతాల్లో నజరయ్య మతం ఒకటి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని త్రిపురాంతకం, నరసరావుపేట, బాపట్ల వంటి కొన్ని ప్రాంతాలకే ఈ మతం పరిమితం కావడంతో కొద్ది కాలంలోనే నజరయ్య మత సిద్ధాంత భావనలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఆనాటి సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలు ప్రత్యామ్నాయ మతాల వైపు చూస్తున్న కాలంలో నజరయ్య మతం వారికి కొంత ఊరటనిచ్చింది.

1890కి ముందు ఒంగోలు కేంద్రంగా నడిచిన మిషనరీలో ఎమ్మా రోషాంబు క్లౌ ఉన్నారు. ఆమె గొప్ప పరిశోధకురాలు. రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యురాలు. ఆ రోజుల్లోనే స్త్రీల హక్కులు, సమస్యల గురించి పుస్తకాలు రాశారు. ఆమె రాసిన ' While Sewing Sandals or Tales of a Telugu Pariah Tribe ' అనే పుస్తకం 1899లో ప్రచురితమైంది. ఈ పుస్తకాన్ని "చెప్పులు కుడుతూ కుడుతూ" అనే పేరుతో వివిన మూర్తి 2009లో తెలుగులో అనువదించారు. ఎమ్మా రోషాంబు క్లౌ ఆనాటి అనగారిన వర్గాల ప్రజలతో కలిసి జీవిస్తూ వారి జీవన, సాంస్కృతిక పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలోనే "నజరయ్య మత" ప్రస్తావన కనిపిస్తుంది. ఎమ్మా రోషాంబు క్లౌ ఆనాటి నజరయ్యను ఒక సంస్కర్తతో పోల్చడం విశేషం.

ఆ రోజుల్లో అణగారిన వర్గాల ప్రజలు క్రైస్తవ్యం స్వీకరించడానికి పూర్వం చాలా మంది నజరయ్య మతంలో ఉన్నట్లు ఎమ్మా రోషాంబు క్లౌ విన్నారు. నజరయ్య మతం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఆమె చాలా ప్రయత్నించారు. లిఖిత ఆధారాలు ఏమీ లభించినప్పటికీ, నజరయ్యను చూసిన వారి నుంచీ, ఆ మతాన్ని స్వీకరించిన వారి నుంచీ ఆమె కొంత మౌఖిక సమాచారాన్ని సేకరించగలిగారు. ఆమె రికార్డు చేసిన సమాచారం ప్రకారం 1825 అంతకన్నా ముందు నజరయ్య మతం విస్తృత ప్రచారంలో ఉంది. ఈ కొత్త మతం త్రిపురాంతకం కేంద్రంగా నడిచింది. నజరయ్య బోధనలు, సిద్ధాంతాలు భారతీయ యోగుల సిద్ధాంతాలకు దగ్గరగా ఉండేవి. సహజంగానే మతాలకు సంబంధించిన అతిశయోక్తులతో కూడిన కథలు ప్రచారంలో ఉన్నట్లే నజరయ్య మత స్థాపనకు సంభందించిన నమ్మకాలు నాటి కాలంలో ప్రచారంలో ఉండేవి.

1750 ప్రాంతంలో ధనవంతుడైన మహమ్మదీయ వర్తకుడు ఉండేవాడు. అతని పేరు షరీఫ్. అతను వ్యాపార నిమిత్తం చేస్తున్న ప్రయాణాలలో ఒక యోగి బోధనలకు ఆకర్షితులయ్యారు. అతని ద్వారా జ్ఞాన బోధనలు నేర్చుకున్నాడు. ఆ తరువాత బాపట్ల తాలూకాలో షరీఫ్ స్వయంగా ఒక గుడి కట్టుకొని తనకు జ్ఞాన బోధ చేసిన యోగి సిద్ధాంతాలను ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఈ నూతన మత సిద్ధాంతాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న అప్పటి నరసరావుపేట రాజు ఆ బోధనలను వినడానికి షరీఫ్ ను ఆహ్వానించాడు. రాజు ఆహ్వానం మేరకు షరీఫ్ ఓ రోజు నరసరావుపేట వెళ్ళాడు. కానీ, రాజదర్శనం లభించలేదు. రెండు రోజుల పాటు వేచి ఉండి ఇక లాభం లేదని తిరిగి బాపట్ల వెళ్లడానికి సిద్ధపడతాడు. ఇదంతా రాజు దగ్గర సహాయకుడిగా ఉన్న నజర్ మహమ్మద్ అనే యువకుడు గమనిస్తాడు. షరీఫ్ ని అనుసరించి తనకు బోధ చేయమని కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు. యువకుడైన నజర్ మహమ్మద్ విన్నపాన్ని మన్నించి షరీఫ్ ఉపదేశం చేస్తాడు. ఈ బోధనలు విన్న నజర్ మహమ్మద్ త్రిపురాంతకం చేరుకుని అక్కడ నుంచే నూతన మతతత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తాడు. కొద్ది కాలంలోనే అతనికి శిష్యులు ఏర్పడతారు. నజర్ మహమ్మద్ బోధనలకు విస్తృత ప్రచారం లభిస్తుంది. జనం తండోపండాలుగా రావడం ప్రారంభిస్తారు. సామాన్య జనం భక్తితో నజర్ పేరుకి ముందు అయ్యా అని చేర్చి నజరయ్యా అని పిలవడం ప్రారంభిస్తారు. అలా ఆయన నజరయ్యగా ఆయన స్థాపించిన మతం నజరయ్య మతంగా పేరు పడింది.  

నజరయ్య మతం ఆనాటి పరిస్థితుల్లో కొన్ని సాంఘిక మార్పులను ఆకాంక్షించింది. ఈ మార్పుల భూమికగా నజరయ్య మత బోధనలు కనిపిస్తాయి. నజరయ్య మతంలో కుల, మత భేదాలు పాటించలేదు. స్త్రీ సమానత్వాన్ని ఎక్కువగా కోరుకున్నారు. ఆడా, మగా ఇద్దరికీ సమానంగా దీక్ష ఇవ్వడం ప్రారంభించారు. కుల వివక్షపై నజరయ్య విరుచుకుపడ్డాడు. నజరయ్య ఉపదేశం చేసిన బోధనలు యోగుల బోధనలతో పోలి ఉండేవి. దేవుడు ఒక్కడే, విగ్రహారాధన చేయకూడదు అనేవి నజరయ్య మతంలో ముఖ్యమైన భావనలు. ఈ కొత్త మతం పట్ల అప్పటి సమాజంలోని మాదిగలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. ఎంతో మంది మాదిగలు నజరయ్య మతంలోకి మారి దీక్ష తీసుకున్నారు. త్రిపురాంతకంలో కుల మతాల పట్టింపులేని పండుగ ఒకటి జరిగేది. ఓకే కుండలో వంట చేసి అందరికీ ఓకే బంతిలో వడ్డించే ఈ పండుగ విధానంలో ఆ నాటి మాదిగలకు గౌరవం లభించింది. అందుకే మొదటిగా మాదిగలు నజరయ్య మతం పట్ల ఆకర్షితులయ్యారు. నజరయ్య మరణానంతరం క్రమేణా ఆయన మత బోధనలు కనుమరుగయ్యాయి. కానీ, నాటి పరిస్థితుల్లో కిందికులాల సాంఘిక స్థాయి పెరగడానికి నజరయ్య మతం ఓ మెట్టుగా ఉపయోగపడింది.

- శిఖా సునీల్ 

--------------------------------

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్