జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

నేను చూసిన హార్సిలీ హిల్స్‌

ఈ వేసవికి ఎక్కడికైనా హిల్ స్టేషన్ కి వెళ్లాలనే ఆలోచన వచ్చిన మరుక్షణమే మా కళ్ళ ముందు హార్సిలీ హిల్స్‌ కనబడింది. చర్చలూ, వాదోపవాదాలు లేకుండా అక్కడికే వెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చాం. సముద్ర మట్టానికి 4312 మీటర్ల ఎత్తున ఉన్న " ఆంధ్రా ఊటీ " హార్సిలీ హిల్స్‌ గురించి అంతకుముందు వినడం, చదవటమే కానీ వెళ్లడం అనేది అదే మొదటిసారి. అది మే మాసం. మండు వేసవి నడి మధ్యకు చేరింది.ఎండ తాపం పెరిగింది. ఇక ఓపిక నశించింది. హార్సిలీ హిల్స్‌  ప్రయాణం తప్పలేదు. గుంటూరు నుంచి తిరుపతి రైలు ప్రయాణం నిద్రలోనే గడిచిపోయింది. తెలతెల వారుతుండగా తిరుపతి రైల్వే స్టేషనులో దిగాం. ఫ్రెష్ అయ్యి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ లో బాగా పొంగిన పూరీలు లాగించి మదనపల్లె వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నాం. చిత్తూరు జిల్లాలో బస్ జర్ని చేయడం అదే మొదటిసారి.

కిటికీ పక్కన కూర్చొని ప్రకృతిని చూస్తూ బస్సు ప్రయాణం చేయడమంటే నాకెందుకో చాలా చాలా ఇష్టం. అలా వేగంగా కదిలే బస్సుతో పాటూ నా ఆలోచనలూ అతి వేగంగా దూసుకుపోతూ ఉంటాయి. కిటికీ పక్కన కూర్చుని క్షణ కాలంలో కనుమరుగైపోయే ప్రకృతి అందాలను ఎక్కడా మిస్ కాకుండా క్షణంలో వేయోవంతులో నా కళ్ళు వాటిని బంధిస్తూ ఉంటాయి. కొత్త ప్రదేశాలు చూడటం నా మనసుకు ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. నేనున్నది ఆంధ్రాలోనే, వెళ్తున్నదీ ఆంధ్రాలోనే  అయినప్పటికీ, ముందెన్నడూ చూడని ప్రదేశాలు చూస్తుంటే వింతగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్రయాణమూ ఆసక్తిగానే ఉంది. విశాలమైన మామిడి తోటలు, విసిరేసినట్లు దూరదూరంగా ఉన్న ఊళ్ళు, మధ్య మధ్యలో ఏపుగా పెరిగిన చింత చెట్లు చూస్తుంటే బలేగా ఉన్నాయి. తిరుపతి నుంచి హార్సిలీ హిల్స్‌కు సుమారు వంద కిలోమీటర్ల ప్రయాణం. అటూ ఇటుగా రెండున్నర గంటల జర్నీ. మదనపల్లె చేరే సరికి పదిన్నర అయింది.


 మదనపల్లె నుంచి హార్సిలీ హిల్స్‌కు ముప్పై కిలోమీటర్ల ప్రయాణం. బస్ స్టేషన్ బయట ఆటోలు, ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. కానీ, నాకెందుకో బస్ జర్నీనే బెటర్ అనిపించింది. హార్సిలీ హిల్స్‌ బస్ పాయింట్ దగ్గర మాలాగే కొద్ది మందే ప్రయాణికులు వేచి ఉన్నారు. వెంటవెంటనే బస్సు సౌకర్యం లేదు. రోజులో ఆరు బస్సులు ఉన్నట్టుగా బోర్డు పెట్టారు. మన వినుకొండ కన్నా కాస్త పెద్దదిగా ఉన్న మదనపల్లె బస్ స్టేషన్లో కొద్దిసేపు టైం పాస్ చేయగానే ఎర్రబస్సు రివ్వున వచ్చి మా ముందు ఆగింది. తోపులాటలు, కిటికీల గుండా తువ్వాలలు వేయడాలు లేవు. అయినా బస్సు నిండిపోయింది. నాకెందుకో తెలియదు కానీ, గట్టి ప్రయత్నం లేకుండానే ఎప్పుడూ బస్సు కిటికీ పక్కనే సీటు దొరుకుతుంది. కొద్దిసేపట్లోనే బస్సు బయలుదేరి మదనపల్లె మార్కెట్ మీదుగా హార్సిలీ హిల్స్‌ వైపు దూసుకుపోతుంది. నా పక్కన ఉన్న కిటికీని పూర్తిగా తెరిచి నా తల మొత్తం బయటపెట్టి అడవి గాలిని గుండెలనిండా పిల్చలనే ప్రయత్నం చేస్తున్నాను. దూరంగా మమ్మల్ని దాటుకుంటూ ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన "రీషి వ్యాలీ" స్కూల్ కనిపించింది. వందల ఎకరాల విస్తీర్ణంలో, ప్రశాంతమైన కొండల నడుమ జేకే గారు అక్కడ ప్రపంచ ప్రఖ్యాత పాఠశాల ఎందుకు నెలకొల్పారో కొద్దిగా అర్థమైంది. ప్రతి రోజూ సూర్యాస్తమయం చూడటం అక్కడ విద్యా విధానంలో ఓ భాగమని ఎక్కడో చదివినట్టు గుర్తొచ్చింది. సూర్యాస్తమయం చుసే అలవాటు చాలా గొప్పదని నా అభిప్రాయం కూడా. ఎందుకంటే, మనతో మనం గడపడానికి, ఆత్మవిమర్శకు అదో గొప్ప అవకాశం. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో తాత్విక చింతనకు కూడా ఆస్కారం ఉంటుందని జిడ్డు కృష్ణమూర్తి గారు భావించి ఉంటారు. అందుకే రిషి వ్యాలీ స్కూల్ అక్కడ ఉంది.అందులో సీటు సంపాదించడం అంత మామూలు విషయం కాదు.

ఆలోచనలతో పాటూ రిషీ వ్యాలీ దాటి మా ఎఱ్ఱ బస్సు రయ్యిన దూసుకుపోతూ ఉంది. ఒంపులు తిరిగే దారుల వెంట ప్రయాణం గమ్మత్తుగా ఉంది. మధ్యలో ఓ చోట ఉన్న చిన్న ఊరిలో ప్రయాణికులు అందరూ దిగి పోయారు. ఇక బస్సులో మిగిలిన వాళ్ళంతా హార్సిలీ హిల్స్‌ పర్యాటకులు. వాళ్లూ కొద్ది మందే, అక్కడక్కడా ఉన్నారు. ఆ ఎత్తైన కొండమీద బస్సు నెమ్మదిగా, భారంగా పోతోంది. అడవి గుండా, లోతైన లోయల గుండా, కొండలు దాటి, కోనలు దాటి, చెట్లూ, పుట్టలు, గుట్టలూ, వాగులూ, వంకలూ దాటి మమ్మల్నందరిని ఈ భూమి మీద నుంచి ఎక్కడికో ఆకాశం మధ్యకు తీసుకు వెళుతున్నట్టు బస్సు నెమ్మదిగా వెళుతోంది. అలా వెళ్ళీ, వెళ్ళీ చివరికి ఆంధ్రప్రదేశ్ లోనే ఎత్తైన, సముద్ర మట్టానికి 4312 మీటర్ల ఎత్తున, 170 ఏళ్ళ క్రితం అప్పటి కడప జిల్లా సబ్ కలెక్టర్ డబ్ల్యు.డి.హార్సిలీ మొదటి సారిగా అడుగు పెట్టిన ఆ గుట్టపై మమ్మల్ని దింపింది. భగభగ మండే ఆకలితో హార్సిలీ హిల్స్‌లో  అడుగు పెట్టాం....(ఇంకా ఉంది )

 - శిఖా సునిల్

కామెంట్‌లు

  1. మీ అభిరుచి బాగుంది.చిత్తూర్ జిల్లా యాస కూడా ముచ్చటగా ఉంటుంది.ఇళ్లలో అందరూ తమిళ్ మాట్లాడతారు.ఇద్దరు చిత్తూర్ వాళ్ళు కలిస్తే తమిళ్లోనే మాట్లాడుకొంటారు.మరోభాగం కోసం ఎదురు చూస్తూ..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్