జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

వినుకొండ విద్యార్థి..

భావకవిత్వానికి భిన్నంగా అభ్యుదయ కవిత్వాన్ని పుట్టించిన నేల మన వినుకొండ. ఇక్కడి గాలుల్లోనే సాహితీ సౌరభాలు వెదజల్లుతాయి. వినుకొండ స్పర్శతో ఎందరో కవులు తెలుగు సాహిత్య చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని పొందారు.



 "పాత కాలం పద్యమైతే, వర్తమానం వచన గేయం" అని ఎలుగెత్తి చాటిన వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు వినుకొండ విద్యార్థి. తెలుగు సాహితీ చరిత్రలో కుందుర్తి సుపరిచితుడు. అప్పటి వరకూ విస్తరించిన కవితోద్యమాలకు భిన్నంగా "వచన కవిత్వాన్ని" ఒక ఉద్యమంగా ప్రచారం చేసిన సాహిత్యకారుడు కుందుర్తి ఆంజనేయులు. అంతకు ముందు తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం లేదని కాదు. మహామహులైన తెలుగు సాహిత్య కారులు చాలా మందే వచన కవిత్వం రాశారు. కానీ, వచన కవిత్వాన్ని ఉద్యమంగా తెలుగుదేశంలో ప్రచారం చేయడంలో కుందుర్తి ఆంజనేయులు సఫలీకృతుడయ్యాడు. అందుకే కుందుర్తికి "వచన కవితా పితామహుడు" ఆన్న బిరుదు సార్థకమైంది. కుందుర్తికి లభించిన వచన కవితా పితామహుడు బిరుదు కూడా అలనాడు అల్లసాని పెద్దనకు లభించిన "ఆంధ్ర కవితా పితామహుడు" బిరుదు లాంటిదేనని సాహితీ విమర్శకులు చెబుతారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన కుందుర్తి ఆంజనేయులుకు వినుకొండతో విడదీయరాని అనుబంధం ఉంది.

గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా కోటవారి పాలెంలో కుందుర్తి ఆంజనేయులు 1922లో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. వీరి తాతగారు వినుకొండలో ఉండేవారు. దీంతో కుందుర్తి ఆంజనేయులు వినుకొండలో తాతగారి వద్ద పెరిగారు. వినుకొండ ప్రాంతం అప్పటికే ఎందరో అభ్యుదయ సాహిత్యకారులను అందించిన నేల. ఎంతైనా కవిసార్వభౌముడు శ్రీనాథుడు నడయాడిన భూమి కదా ! అప్పటికే (1941 కి ముందు) మహాకవి గుర్రం జాషువా విశ్వనరుడిగా ఎదిగే క్రమంలో ఉన్నారు. కానీ, బతుకు దెరువు కోసం ఉద్యోగం కావాలి. అందుకే ఉభయ భాషాప్రవీణుడిగా శిక్షణ పొందిన గుర్రం జాషువా అప్పటి గుంటూరు బోర్డు ప్రెసిడెంట్ గా ఉన్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సహకారంతో వినుకొండలోని మిడిల్ స్కూల్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందాడు. వినుకొండలో ఉన్న ఈ మిడిల్ స్కూల్ నే తరువాత ఒకటో వార్డు పాఠశాలగా, ఇప్పుడు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలగా పిలిచేవారు. ఈ పాఠశాలలోనే కుందుర్తి ఆంజనేయులు 8వ తరగతి వరకు గుర్రం జాషువా వద్ద సాహిత్య పాఠాలు శ్రద్ధగా విన్నారు.

ఎనిమిదో తరగతి వరకు వినుకొండలోనే కుందుర్తి ఆంజనేయులు చదువుకున్నారు. ఆ తర్వాత కళాశాల విద్య కోసం విజయవాడ వెళ్ళారు. అక్కడ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు మాస్టారుగా ఉన్న కళాశాలలో పాఠాలు విన్నారు. అందుకే కుందుర్తి ఆంజనేయులుపై గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణల ప్రభావం అధికంగానే ఉండేది. చదువు పూర్తయిన తర్వాత ఆంగ్ల ఉపన్యాసకుడిగా, సమాచార పౌర సంబంధాల శాఖలో ఉద్యోగం చేసినప్పటికీ సాహిత్య సేవకే పూర్తి సమయాన్ని వెచ్చించారు. నరసరావుపేటలో నవ్య కళాపరిషత్తు స్థాపించాడు. ఇందులోనే బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం,అనిశెట్టి సభ్యులుగా ఉన్నారు. వచన కవిత్వాన్ని ఉద్యమంగా ప్రారంభించిన తర్వాత హైదరాబాదులో "ఫ్రివర్స్ ఫ్రంట్" స్థాపించారు. వచన కవితా ప్రక్రియను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రధాన ఆశయం.

" వచన కవితా విచారణలో

ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను

అలనాటి కవితా లతాంగిని హత్య చేశాను

అలంకార ఆభరణాలు అపహరించాను

అన్ని ఒప్పేసుకున్నాను

ఆనాడు బోనులో ఎక్కి

క్రింది కోర్టు వేసిన శిక్షను

మానవ కారుణ్య దృక్పథంతో సడలించి

జన్మ ఖైదు వేశారు, హైకోర్టు న్యాయమూర్తులు

ఒక తరం పాటు బ్రతకాలన్నారు బందీగా

పాఠకుల గుండెల చెరసాలలో.." 

అని తన గురించి కవితాత్మకంగా చెప్పుకున్న కుందుర్తి ఆంజనేయులు జన్మించి ఈ ఏడాదితో వందేళ్లు....

 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్